15-11-2025 02:32:06 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రోడ్డుప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సందర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
వైద్యులతో మాట్లాడి చికిత్సపై సమీక్షించిన కలెక్టర్, డిశ్చార్జ్ తర్వాత ప్రత్యేక బోధన ఏర్పాటు చేయాలని డీఈఓకు ఆదేశించారు. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న శివ ఆరోగ్యస్థితిని కూడా కలెక్టర్ వివరంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని విద్యా, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.