15-11-2025 03:39:53 PM
చిట్యాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కలెక్టరేట్ ముందు బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చికిలంమెట్ల అశోక్ కోరారు. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో శనివారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను, ఫసల్ బీమా యోజన ను అమలు చేయాలని కోరారు.
బోనస్ ను వెంటనే చెల్లించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 17 ఉదయం 10 గంటల నుండి, 18 ఉదయం 11 గంటల వరకు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే నిరాహార దీక్షకు ముఖ్యఅతిథిగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాలక్ష్మి నరసయ్య, బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొంటున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా నలుమూలల నుండి రైతులు బిజెపి, కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.