వేసవి శిబిరాలతో ఎన్నో ప్రయోజనాలు
నిర్మల్,(విజయక్రాంతి): వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం, పట్టణంలోని జుమ్మెరాత్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్, పిల్లలతో ముచ్చటించి వారి వివరాలు, జీవిత లక్ష్యాలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు సమ్మర్ క్యాంప్ కి రావాలని చెప్పారు. సమ్మర్ క్యాంపులో ఆటలు, పాటలు, యోగ, డ్యాన్స్, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారని వివరించారు.
పిల్లలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. వేసవి శిబిరాలతో పిల్లల నైపుణ్యాల పెరుగుదలతో పాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభ బయట పడుతుందన్నారు. ఉపాధ్యాయులు, శిక్షకులు, వేసవి శిబిరాలకు వచ్చే విద్యార్థులకు అన్ని విషయాలు చక్కగా నేర్పించాలని వివరించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పదవ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ, అందరూ ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని, అధైర్య పడవద్దని ప్రోత్సహించారు.
ఆయా సబ్జెక్టులు శ్రద్ధగా చదువుకొని ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్న ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని అన్నారు. వారి భయాలు, సందేహాలు తొలగించి, వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






