05-09-2025 05:29:07 PM
వనపర్తి టౌన్: తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో తమ పిల్లలు పట్టించుకోకుండా వదిలేస్తే అలాంటి వారికి వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం-2007 ద్వారా న్యాయం పొందటానికి ఆర్డీఓ వద్ద ట్రిబ్యునల్ కేసులు పెట్టీ న్యాయం పొందవచ్చు. ఒకవేళ ఆర్డీఓ దగ్గర న్యాయం దొరకని పక్షంలో లేదా నిర్లక్ష్యానికి గురి అయిన పక్షములో జిల్లా కలెక్టర్ వద్ద అప్పిల్ చేసుకోవచ్చన్నారు. ఆర్డీఓ వద్ద ట్రిబ్యునల్ కేసు పెట్టాలన్న, లేదా కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవాలనుకున్న కార్యాలయాల చుట్టు తిరగకుండా ప్రభుత్వం టీఎస్ సిఎంఎంఎస్ పోర్టల్ (TSCMMS) ను తీసుకువచ్చిందనీ ఈ పోర్టల్ ను జిల్లాలోని వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గర ఉన్న ట్రిబ్యునల్ కేసులు, జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్న అప్పిలేటు కేసు యొక్క వివరాలు.. పెండెన్సీ ఉత్తర్వుల వివరాలను టీఎస్ సిఎంఎంఎస్ పోర్టల్ లో నిక్షిప్తం అయి ఉంటాయన్నారు. వయోవృద్ధులు తమ మెయింటెనెన్స్ కు సంబంధించిన కేసును ఆన్లైన్ పోర్టల్. లేదా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా వయోవృద్ధులు తమ కేసులకు సంబంధించిన వివరాలను పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అందువల్ల జిల్లాలోని వయోవృద్ధులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.