బుక్ చేసిన 12 గంటల్లోపు...ట్యాంకర్ డెలివరీ ఇవ్వాలి
నీటి సరఫరాలో కృత్రిమకొరత సృష్టిస్తే చర్యలు
సమీక్షలో జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): నగరంలో నీటి ట్యాంకర్లు బుక్చేసిన 12గంటల్లోపు డెలివరి చేయాలని జలమండలి ఎండి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. సీఎస్ సూచనల మేరకు మంగళవారం జలమండలి కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ అంశాలపై ఆరా తీశారు. బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సత్వరం డెలివరి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాల న్నారు. వేసవి నేపథ్యంలో మెట్రో కస్టమర్ కేర్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని, ముఖ్యంగా మంచినీటి సరఫరా, మురుగునీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మురుగునీటి నిర్వహణపైన దృష్టి సారించాలని, ట్యాంకర్ల మళ్లింపు విషయంలోనూ కఠినంగా ఉండాలన్నారు. రాత్రివేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో వలన సత్ఫలితాలున్నాయన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డైరెక్టర్ అజ్మీరాకృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్ స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.
నగరంలో ట్యాంకర్ బుకింగ్ , డెలివరి వివరాలు:
క్ర. సం వివరాలు మార్చి 31 వరకు ఏప్రిల్ 22 వరకు
1. మొత్తం ట్యాంకర్లు 613 816
2. ఫిల్లింగ్ స్టేషన్లు 70 86
3. ఫిల్లింగ్ పాయింట్స్ 108 151
4. రోజూవారి బుకింగ్స్ 4,945 6,064
5. రోజూవారి డెలివరీ 6,579 8,390
6. సరఫరా చేసిన ట్రిప్పులు 1,68,996 1,67,134






