ట్రైబల్ మ్యూజియం సందర్శించిన కేయూ ప్రొఫెసర్స్ బృందం
భద్రాచలం, మే 3, (విజయక్రాంతి): భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో పొందుపరిచిన కళాఖండాలు చాలా అద్భుత ఉన్నాయని, గిరిజన అభివృద్ధి కొరకు పాటుపడడమే కాక వారి సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియం రూపకల్పన చేసిన ఐటీడీఏ పిఓ బి. రాహుల్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు మదర్ తెరిస్సా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ జంతు శాస్త్రం విభాగం ప్రొఫెసర్ నారాయణ, ప్రొఫెసర్ వెంకయ్య, బోటనీ విభాగము డాక్టర్ కరుణాకర్ రావు మరియు డాక్టర్ ఆశీర్వాదం మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలోని ఆదివాసీలకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను,కళాకృతులను పరిశీలించినారు.
మారుమూల ఆదివాసి గిరిజనుల యొక్క పురాతన వస్తువులను సేకరించి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భావితరాలకు తెలిసే విధంగా మ్యూజియంలో పొందుపరచడం చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. ఆహార సేకరణకు ఉపయోగించే వస్తువులు మరియు నీళ్లకు ఉపయోగించే సొరకాయతో చేసినటువంటి సొరకాయ బుర్రలు బాగున్నాయని, ఆదివాసులు ఆధునిక పోకడలకు పోకుండా పర్యావరణాన్ని కాపాడే వస్తువులను నిత్యజీవితంలో ఉపయోగించుకోవాలని, ప్లాస్టిక్ వస్తువులను నిరోధించి పర్యావరణాన్ని కాపాడడంలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి, సిబ్బంది మాధవి తదితరులు పాల్గొన్నారు.






