07-12-2025 12:15:01 AM
పోలీసుల తీరుపట్ల మండిపడిన ఎమ్మెల్సీ
మేడ్చల్, డిసెంబర్ 6 (విజయ క్రాంతి): సాయి ఈశ్వర్ అంత్యక్రియలకు వెళ్లకుండా ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పిర్జాదిగూడలోని చెన్నారెడ్డి ఎనక్లేవ్లో తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా మల్లన్న పోలీసులు, ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ అంత్యక్రియలకు వెళితే ఏం అభ్యంతరమని ఆయన ప్రశ్నించారు.మల్లన్న హౌస్ అరెస్టు చేయడమే గాక ఇతర బీసీ నాయకుల కదలికలపై పోలీసులు నిఘా వేశారు. జగద్గిరిగుట్టలోని సాయి ఈశ్వర్ ఇంటి వద్ద సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.