18-09-2025 06:22:41 PM
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ వేడుకలను భూపాలపల్లి జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఆ పార్టీ నేత రవి పటేల్ భూపాలపల్లి టౌన్ లో కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న బుధవారం హైదరాబాద్ తాజ్ కృష్ణలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిష్కరించడం జరిగిందన్నారు.
పేద బడుగు బలహీన వర్గాలు పేదల నాయకుడి కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఆ పార్టీ భూపాలపల్లి జిల్లాకు విస్తరించాలని ఆ పార్టీ జెండా ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేయాలని రవి పటేల్ కోరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధి విధానాలు విద్య,వైద్యం సత్వర న్యాయం భూమిలేని నిరుపేదలకు రెండు ఎకరాల భూమి పంచడం రాబోవు 2028 లో తీన్మార్ మల్లన్న ను ముఖ్యమంత్రిని చేయడమేనన్నారు.కాంగ్రెస్,బిజెపి,బి ఆర్ ఎస్ పార్టీలని ఎదుర్కొని ప్రజా సమస్యల మీద ఎల్లవేళల పోరాడుతూ గడప గడపకు పార్టీ విధి విధానాలు చేరే విధంగా కృషి చేయాలని నేతలను,కార్యకర్తలను రవి పటేల్ కోరారు.ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.