28-06-2025 12:16:21 AM
-ఆహ్వానించిన పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక అభినందనలు
-పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తున్నా
-నియోజకవర్గ అభివృద్ధి పనుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రులకు ధన్యవాదాలు
-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, జూన్27(విజయక్రాంతి): కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకున్న డబుల్ రోడ్డును రూ.77.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫోర్ లేన్ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంతోపాటు హుస్నాబాద్ లో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, 50 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి రావాల్సిందిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చండీఘడ్ వెళ్లాల్సి రావడంతో ఆయా కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయానని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తనను ఆహ్వనించిన పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక అభినందలు తెలిపారు.
అభివ్రుద్ధి పనుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహలకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న తాను కరీంనగర్ పార్లమెంట్ ప్రజల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా క్రుషి చేస్తున్నానని, అందులో భాగంగా కేంద్రం నుండి నిధులు తీసుకొస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివ్రుద్ధికి తమ వంతు క్రుషి చేయాలని కోరారు.