23-10-2025 07:47:56 PM
కలెక్టర్ కు విన్నవించిన బీజేపీ నాయకులు
కామారెడ్డి (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర రాజధానిలో గోరక్షకులపై దాడి చెందిన నిధితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలనీ డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని పోచారంలో గోవులను తరలిస్తున్న ఎంఐఎం నాయకులను అడ్డుకున్నందుకు సోను సింగ్ (ప్రశాంత్) పై తుపాకీతో కాల్పులు జరపడం జరిగిందనీ, ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడ్డ సోను (ప్రశాంత్) ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ అన్నారు. ఇలాంటి మతవాద దాడులు రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని నిరూపిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ తెలంగాణ రాష్ట్రంలో ఎం.ఐ.ఎం మతోన్మాద మూకల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయిందనీ, ఎం.ఐ.ఎం నాయకుల రాక్షసత్వానికి బీ.ఆర్.ఎస్ పార్టీ మౌనంగా ఉండి మద్దతు తెలిపితే, కాంగ్రెస్ పార్టీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందనీ అన్నారు. అమాయక ప్రజలపై, అధికార యంత్రంగం పై, చివరికి రక్షణ కల్పించే పోలీసుల గుండెల్లో ఎం.ఐ.ఎం గూండాలు కోరలు దింపుతున్నా.. చోద్యం చూస్తున్న చేవలేని కాంగ్రెస్ పార్టీ చేతకానితనాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు నేతృత్వంలో కాంగ్రెస్- ఎంఐఎం రజాకార్ పాలనకు వ్యతిరేకంగా నిరసన చేపడితే, గోరక్షకులపై తుపాకీలతో దాడి చేసిన ఎం.ఐ.ఎం నాయకులను, పోలీసులపై దాడి చేసిన ఎం.ఐ.ఎం కార్యకర్తలను అరెస్టు చేసే దమ్ములేని కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన చేపట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని, బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే దోషులను అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు, హిందువుల భద్రతకు హామీ ఇవ్వలేని పక్షంలో, ఆ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోటూరి శ్రీకాంత్, బాలకిషన్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.