calender_icon.png 7 July, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం

07-07-2025 12:20:16 AM

సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,జులై 6 (విజయ క్రాంతి): ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించే విధంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి,సన్మానం,నగదు బహుమతి, ప్రతిభ  పురస్కారాల ప్రధానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆదివారం మండల కేంద్రంలోని అధికారిక క్యాంప్ కార్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా  62 ప్రభుత్వ పాఠశాలల కు చెందిన 188 విద్యార్థినీ విద్యార్థులను సన్మానించి, ప్రతిభ పురస్కారంతోపాటు  నగదు బహుమతి ని అందజేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి , ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తూ  ప్రోత్సాహం కలిగిస్తే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని రాజగోపాల్ రెడ్డి  మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు అని అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ముందుకు వెళ్తున్నారు మీ అందరి తోడ్పాటు  తో అది సాధ్యమవుతుందని నమ్ముతున్నాను.

 క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పైన ఎన్నో సమీక్షలు చేశాం..

మునుగోడు క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పైన ఎన్నో సమీక్ష సమావేశాల్లో నిర్వహించాము కానీ ఇదే మంచి కార్యక్రమంగా అనిపిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.మన సంపాదించుకున్న ధనం పోతుంది, కానీ మనం చదివిన జ్ఞానం ఎటు పోదు, చదువుకున్న వ్యక్తి పదిమందికి సహాయం గా ఉంటాడు, చదువు లేకపోవడం వల్లనే అజ్ఞానంతో సమస్యల వలయంలో చిక్కుకుని పోతున్నారు మద్యానికి బానిస అవుతున్నారు. 

పేదలు కాయ కష్టం చేసుకుంటూ తమ సంపాదనలో 75% పిల్లల చదువుకే ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించడం ఒక స్టేటస్ లాగా భావిస్తున్నారు.. ఆలోచన నుండి బయటపడేయడానికి ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. పేదల చదువుకు గత ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువగానే ఖర్చుచేసి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దాంట్లో భాగంగానే నియోజకవర్గంలలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం.

ప్రభుత్వ విద్య బలోపేతంపై దానిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే చాలా సమీక్షలు చేశాం.నియోజకవర్గ వ్యాప్తంగా 330 ప్రభుత్వ పాఠశాలలున్నాయి.వాటిలో 9500 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు.

కొన్నేండ్లు గా  పరిపాలించిన ప్రభుత్వాలు విద్య పైన ఎక్కువ నిధులు కేటాయించలేదు.  నియోజకవర్గ వ్యాప్తంగా 43 ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాము.ఈ 43 పాఠశాలల్లో 20వేల మంది విద్యార్థులు తగ్గకుండా చదివే లాగా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాం. విద్యార్థులకు సహకారం అందించడానికి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది.