calender_icon.png 7 July, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంగిన బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా?

07-07-2025 12:44:16 AM

- కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు

- పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీఆర్‌ఎస్ కుట్ర

- కాంగ్రెస్ పాలనలో రైతులు బాగుపడితే ఓర్వలేకపోతున్నారు

- హరీశ్‌రావు గోబెల్స్‌కు మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు..

- రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదకర పరిస్థితిలోనే ఉన్నాయని, కుంగిన బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా? అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

గోబెల్స్‌కు మించి అబ ద్ధాలు ప్రచారం చేయడం హరీశ్‌రావుకు ఆనవాయితీగా మారిందని విరుచుకుపడ్డారు. పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తట్టుకోలేకపోతున్న బీఆర్‌ఎస్ నేతలు రైతాంగాన్ని అయోమయంలో పడేసేందుకు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

కిందేటేడాది చరిత్రనే తిరగరాసే విధంగా అటు వానాకాలంతో పాటు ఇటు యాసంగిలోనూ ధాన్యం దిగుబడిలో చరిత్ర సృష్టించిందన్నారు. ఆ విషయాన్ని మరిచిపోయి హరీశ్‌రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వానాకాలంలో రాష్ర్టంలోని రైతులు 66.7లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల టన్నుల ధాన్యం పండించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే..130లక్షల టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులకే దక్కిందన్నారు. దేశచరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల టన్నుల ధాన్యం సాధించిన రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందన్నారు. 

రైతులు బాగుపడితే ఓర్వలేరా..

తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిస్తే ఓర్వలేని గుణం బీఆర్‌ఎస్ నాయకులదని ఆయన విమర్శించారు. పదేండ్లలో తాము చేసిన తప్పులు, దుర్మార్గాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ ఇప్పటికీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని తెలిపారు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని, సీకెంట్ ఫైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పుబట్టిందన్నారు. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అదే సీకెంట్ ఫైల్స్ ఫౌండేషన్ టెక్నాలజీతో నిర్మించటంతో ప్రమాదకరంగా మారాయని, అవి అక్కరకు రాని పరిస్థితిలోనే ఉన్నాయని వివరించారు.

గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కడ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదాట్లో పోసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై తగిన నిర్ణయం తీసుకుంటుందని, హరీశ్‌రావు కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం మాకు లేదని ఆయన తేల్చిచెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గరి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు నీటిని లిఫ్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆ మూడు బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో, తప్పుడు డిజైన్లతో నిర్మించిన దుర్మార్గం గత ప్రభుత్వానిదన్నారు.

ఆ మూడు బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్‌ఏ హెచ్చరించినా కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని హరీశ్‌రావు పదే పదే మాట్లాడటం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కరకు రాకుండా నిర్మించిన తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు వల్లించటం తప్ప,  ప్రజల ప్రయోజనాలను బీఆర్‌ఎస్ లీడర్లు మరిచిపోయారని విమర్శించారు. 

పాత విధానంలోనే కల్వకుర్తి నీళ్లు..

కల్వకుర్తి పంపులు ప్రతీ ఏడాది జూలై చివరిలో లేదా ఆగస్ట్ ఒకటో తేదీన స్విఛ్‌ఆన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారని, ఈసారి కూడా అదే విధానం అమలవుతుందన్నారు. అందులో రైతులు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2019లో ఆగస్ట్ 1న,  2020లో ఆగస్ట్ 31, 2021లో ఆగస్ట్ 15న, 2022లో జులై 13న, 2023లో ఆగస్ట్ 6న కల్వకుర్తి లిఫ్ట్‌లు ఆన్ చేశారని, గత ఏడాది జూలై 27న స్విఛాన్ చేశామని గుర్తుచేశారు.

రైతుల అవసరాలు, నీటినిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలి.. ఎంత ఆయకట్టుకు ఇవ్వాలి.. ఈసారి ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈనెల 11న జరిగే స్టేట్ లెవల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటేడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ మీటింగ్‌లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రణాళిక సిద్ధమవుతుందన్నారు. 

కృష్ణా జలాలపై బయటపడ్డ బీఆర్‌ఎస్ కుట్రలు..

కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించటం వెనుక అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ ఇప్పటికే బయటపడ్డాయని, వాళ్ల హయంలోనే పోతిరెడ్డిపాడు కెపాసిటీ రెండింతలకు మించి 88వేల క్యూసెక్కులకు పెంచుకున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్, ముచ్చుమర్రి నుంచి రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకునే కుట్రలకు బీఆర్‌ఎస్ దొంగచాటుగా సహకరించిందని తెలిపారు.

2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకపోతే..2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1,225 టీఎంసీల నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు రికార్డులున్నాయని వివరించారు. బీఆర్‌ఎస్ పాలకులు తెలంగాణ ప్రయోజనాలను ఎలా తాకట్టుపెట్టారో తెలియజేసేందుకు ఇంతకు మించిన సాక్ష్యమేముంటుందని అన్నారు.

ఉమ్మడి రాష్ర్టం నుంచి ఇప్పటివరకు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్‌లో, కృష్ణా బేసిన్‌లో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసింది, ఎక్కువ సాగునీటిని వినియోగించింది, ఎక్కువ పంట పండించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అని వివరించారు. పంటల దిగుబడి రికార్డు స్థాయికి పెరిగిందని, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయని, అందుకే రైతు మేలు కోరే కార్యక్రమాలు చేపట్టడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.