07-07-2025 12:52:51 AM
10 కి.మీ ప్రయాణం.. రూ.320 టికెట్
-రెట్టింపైన ఏసీ బస్సుల చార్జీలు
-రెవెన్యూ పెంపు కోసమేనంటున్న ఆర్టీసీ వర్గాలు
-నష్టాల భారాన్ని ప్రయాణికులపై మోపుతారా?
-అంటూ ఆర్టీసీపై విమర్శలు
-తగ్గిన ఆక్యుపెన్సీ రేషియో.. డిస్కౌంట్ ఇస్తామంటున్న అధికారులు
-మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రాజీవ్గాంధీ ఇంటర్నేష నల్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐఏ)నుంచి హైదరాబాద్ నగరా నికి మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో పుష్పక్ పేరిట ఆర్టీసీ ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు.
ప్రయాణికులకు అందుబా టు ధరల్లో రవాణా సౌకర్యం కల్పించడం, మెరుగైన కనెక్టివిటీ, ప్రయా ణ సమయాన్ని తగ్గించడం, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ఈ బస్సులకు విపరీతమైన డిమాండ్ వచ్చిం ది. 24/7 సేవలుండటంతో దేశవిదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండేది.
కాలక్రమేణా ఓలా, ఉబర్, ర్యాపిడో సహా అనే క క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో పుష్పక్ బస్సులకు డిమాండ్ తగ్గిం ది. దాంతో చాలా బస్సులు ఖాళీగా వెళ్లిరావడం ఆనవాయితీగా మారింది. అయితే ఇదే సమయంలో బస్సు టికెట్ చార్జీలను అమాంతం పెంచడంతో మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు అయ్యింది. 10కి.మీ. ప్రయాణానికి రూ.320వసూలు చేస్తూ ఖరీదైన ప్రజా రవాణా వ్యవస్థగా పుష్పక్ను ఆర్టీసీ తీర్చిదిద్దింది.
రెట్టింపు చార్జీలతో ప్రయాణం..
ఈ నెల 5న కుర్ని శ్రీనివాస్ అనే ప్రయాణికుడు ఎయిర్పోర్ట్ నుంచి బాలాపూర్ వ స్తున్న క్రమంలో రూ. 320 టికెట్ రేటు చూ సి అవాక్కయ్యారు. గతంలో కేవలం రూ. 150 ఉన్న టికెట్ ధర కేవలం కొన్ని రోజు ల వ్యవధిలోనే ఎందుకు రెట్టింపు అయ్యిందని డ్రైవర్ కం కండక్టర్ను ప్రశ్నిస్తే.. ‘అక్యు పెన్సీరేషియో లేదని చెప్పి టికెట్ ధరలు పెంచామని అధికారులు అంటున్నారు.. అంతకుమించి మాకు తెలియదు..’ అనే సమాధానం వచ్చింది.
చేసేదేమీ లేక టికె ట్ తీసుకుని బస్సులో కూర్చుంటే కనీసం పట్టుమని పది మంది కూడా లేకుండానే బస్సు బయలుదేరింది. ఎయిర్పోర్ట్ నుం చి నగరానికి వచ్చే పుష్పక్ బస్సులో బాలాపూర్కు సుమారు 10కి.మీ.పైగా దూరం ప్రయాణానికి రూ.320 టికెట్ వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు కి.మీ.కు రూ. 32 వరకు వసూలు చేస్తున్నారు. ఇంతకంటే కాస్ట్లీ జర్నీ నగరంలో ఏదీ లేదని విమర్శలు వస్తున్నాయి.
ఎయిర్పోర్ట్ నుంచి బాలాపూర్కు క్యాబ్లో వస్తే..
ఎయిర్పోర్ట్ నుంచి బాలాపూర్కు పుష్పక్లో కాకుండా క్యాబ్లో వస్తే.. రూ. 600 నుంచి రూ. 700లోపు అవుతోంది. ఫ్యామి లీ వచ్చినప్పుడు నలుగురు వ్యక్తు లు హా యిగా క్యాబ్ ఎక్కి బస్టాప్ వద్ద కా కుండా నేరుగా ఇంటికే చేరుకోవచ్చు. ఒక్కరికి రూ. 150 పడుతుంది. అంటే ఆర్టీసీ పుష్పక్లో కాకుండా క్యాబ్లో నేరుగా ఇంటికే వస్తే దాదాపుగా రూ.170 మిగులుతుంది.
ఇలాంటప్పుడు నేరుగా ఇంటికే చేరుకునే చక్కని సౌకర్యం ఉన్న క్యాబ్లో కాకుండా ఎక్కువ డబ్బులు చెల్లించి పుష్పక్లో ఎందుకు ప్రయాణిస్తారని ప్రయాణికులు అంటున్నా రు. శంషాబాద్, ఆరాంఘర్, పహాడీ షరీఫ్ వంటి దగ్గరి స్టేషన్లదంతా ఇదే పరిస్థితి.
పెరిగిన చార్జీలు
పుష్పక్ బస్సులలో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణిం చడం చాలా ఖరీదుగా మారిపోయింది. కనీ సం చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటన చేయకుండా, ప్రజలకు తెలియచేయకుండా పెద్దఎత్తున పెంచేశారు. నగరం నుంచి ఎయి ర్పోర్ట్కు వెళ్లే సమయంలో రూ.50 మేర, వచ్చేప్పుడు రూ.100 వరకు పెంచినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ రాజశేఖర్ ‘విజయక్రాంతి’కి తెలిపారు.
ఈ ఛార్జీలు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయన్నారు. తక్కువ ఆక్యుపెన్సీరేషియా వల్లే ఛార్జీలు పెం చినట్లు తెలిపారు. ఇటీవల టోల్రూట్లలో చార్జీల పెంపు పేరిట ఆర్టీసీ పలు రూట్లలో భారీగా ఛార్జీలు పెంచింది. అయితే అందుకు టోల్ పెంపు కారణంగా చూపింది. కానీ పుష్పక్ చార్జీల పెంపును ప్రజలకు తెలియచేయకుండా పెంచడమే ఆర్టీసీ ఒంటెద్దుపో కడగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
మ హాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా ఆర్టీసీకి పెద్దఎత్తున భారం పెరిగిపోయిన నేపథ్యంలోనే అవకాశం ఉన్న చోట్లలో టికె ట్ ధరలు పెంచుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే స్టూడెంట్, జనరల్ బస్సు పాసుల చార్జీలను పెంచిన ఆర్టీసీ, టోల్ చార్జీల పెంపు పేరిట టోల్ మార్గాల్లో భారీగా చార్జీలను పెంచింది.
తగ్గిన డిమాండ్..
నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లే పుష్పక్ బస్సులకు గతంలోనే ప్రయాణికుల ఆక్యుపెన్సీ అంతంత మా త్రంగా ఉండేది. ఇప్పుడు చార్జీలు ఊహించ ని స్థాయిలో పెంచడంతో ఆక్యుపెన్సీ ఇం కా తగ్గిపోయింది. ఎయిర్పోర్ట్కు వెళ్లేవారం తా ధనవంతులనే భావనలో ఆర్టీసీ అధికారులు ఉన్నట్లు తోస్తోందని ఇది ముమ్మాటికీ కరెక్టు కాదని ప్రయాణికులు అంటున్నారు. చాలామంది గల్ఫ్లో బతుకుదెరువు కోసం వెళ్తారు.
కొందరు విదేశాల్లో విద్య, ఉపాధి కోసం, మరికొందరు అత్యవసర ప్రయాణాలకు విమానాలను ఆశ్రయి స్తారు. ఇక వీరికి సెండాఫ్ ఇచ్చేందుకు చాలా మంది ఎయిర్పోర్ట్కు వెళ్తుంటా రు. వీరిలో చాలా మంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు.
అలాంటి వారు టికెట్ ధరలు ఎక్కువుంటే క్యాబ్లు ఆశ్రయిస్తారు తప్పించి ఆర్టీసీ బస్సులో ఎక్కే పరిస్థితి ఉండదు. ధనవంతులు సొంత వాహనాల్లోనే వస్తారు తప్పిం చి పుష్పక్ బస్సుల్లో రారు అని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రస్తుతం పెంచిన ధరల కారణంగా ఆక్యుపెన్సీ రేషియో మరింతగా పడిపోయిందని తెలుస్తోంది.
ప్రయాణికులను కోల్పోయేలా ఆర్టీసీ తీరు..
రెగ్యులర్గా ఎయిర్పోర్ట్ నుంచి మల్లాపూర్ చేరుకునేందుకు రూ.150 చెల్లించి ప్రయాణించేవాడిని. ఈ నెల 6న ఎయిర్పోర్ట్ నుంచి పుష్పక్ బస్సులో టికెట్ ధర చూసి షాక్ అయ్యా. రూ.150 నుంచి ఒకేసారి రూ.320లకు టికెట్ ధరను పెంచేశారు. కనీసం ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం లేకుండా ఈ ధరల పెంపు ఏంటి? మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో వచ్చే లోటును మా లాంటి ప్రయాణికులపై వేస్తున్నారనిపిస్తోంది.
ఉచిత తాయిలాలు ఇచ్చినప్పుడు వాటిని నిర్వహించలేని ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఆ భారాన్ని సాధారణ ప్రయాణికులపై వేయడం సమంజసం కాదు. ఆర్టీసీ తీరు చూస్తుంటే డబ్బులు పెట్టి టికెట్లు కొనే ప్రయాణికులను వదులుకునేలా కనిపిస్తోంది.
కుర్ని శ్రీనివాస్, మల్లాపూర్, హైదరాబాద్
పుష్పక్ రూట్లు ఇవే..
జూబ్లీ బస్స్టేషన్ నుంచి సంగీ త్, తార్నాక, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఎల్బీనగర్, బాలాపూర్, పహాడిషరీఫ్ మా ర్గంలో, సికింద్రాబాద్ నుంచి పారడైజ్, బేగంపేట, నాంపల్లి, అఫ్జల్ గంజ్, బహదూర్పురా, ఆరాంఘర్, శంషాబాద్ మీదుగా, మియాపూర్ నుంచి హైదర్నగర్, ప్రగతినగర్, జేఎన్టీయూ, ఫోరమ్మాల్, మలేషియన్ టౌన్షిప్, శిల్పారామం, మైం డ్స్పేస్, గచ్చిబౌలి ద్వారా అనేక పు ష్పక్ బస్సులు ఎయిర్పోర్ట్కు చేరుకుంటాయి.