ఉచిత ఆటో ఏర్పాటు అభినందనీయం
రాజాపూర్ జూన్ 18: మండలంలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కీర్తిశేషులు పసులది చిన్నారెడ్డి, భారతమ్మ కుమారులు లింగారెడ్డి, కృష్ణారెడ్డి తమ పుట్టిన ఊరికి ఏదో సేవ చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో గ్రామం నుండి చదువుకునేందుకు రాజాపూర్ నడుచుకుంటూ వెళుతున్న బాలికలకు తన సొంత ఖర్చులతో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.
గురువారం బాలికల కోసం ఉచిత ఆటో ప్రారంభిచారు. గ్రామం నుండి ఆడపిల్లలు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు చూసి చలించిపోయి ఈ విద్య సంవత్సరం నుంచి ఏ ఒక్క ఆడపిల్ల మల్లేపల్లి నుండి రాజాపూర్ ప్రభుత్వ పాఠశాలలకు నడుస్తు వెళ్ళకూడదు అని ఒక సంకల్పంతో ఉచిత ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు ఈ ఆటో సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొవాలని కోరారు.భవిష్యత్తులో ఉన్నంత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాసమల్ల లింగం, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి నాయక్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






