జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో సెన్సస్ హ్యాండ్ బుక్ అత్యంత కీలకం
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూలై 13 (విజయక్రాంతి) : జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో సెన్సస్ హ్యాండ్ బుక్ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. 2027 జనాభా గణనలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ తయారీకి క్షేత్రస్థాయిలో పనిచేసే గణకులకు సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 265 గ్రామాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో సమగ్ర సమాచార సేకరణ కోసం మొత్తం 270 మంది గణకులను నియమించినట్లు తెలిపారు.
జూలై 13 నుండి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగే ఈ శిక్షణలో, ప్రతిరోజూ 50 మంది చొప్పున అవగాహన కల్పిస్తామన్నారు.గ్రామ డైరెక్టరీ తయారీలో భాగంగా గణకులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. విద్య, వైద్యం, నీరు-పారిశుధ్యం, కమ్యూనికేషన్, రవాణా, బ్యాంకింగ్, విద్యుత్, భూవినియోగం, వ్యవసాయ-హస్తకళల ఉత్పత్తులతో పాటు గ్రామ పరిశీలన వంటి 9 ప్రధాన అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎక్కడా తప్పులు దొర్లకుండా, వాస్తవ సమాచారాన్ని సేకరించి నిర్ణీత గడువులోగా నివేదికలను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్. కిషన్, జిల్లా సెన్సస్ అధికారి ఇస్లావత్ హోబాలాల్, గణంకా అధికారులు వి. రామారావు, ఎం. రాజేష్, తదితరులు పాల్గొన్నారు.






