01-06-2025 12:00:00 AM
అలహాబాద్, మే 31: తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా దేశం ఐక్యంగా నిలబడిందంటే దానికి మన రూపొందించుకున్న రాజ్యాంగమే కారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బీఆర్ గవా య్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం వల్లే భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వెల్లడించారు.
శనివారం అలహాబాద్ హైకోర్టు ఆవరణలో అడ్వకేట్ చాంబర్తో పాటు మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ను జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం పూర్తిగా సమాఖ్య లేదా ఏకీకృతం కాదని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించినట్టు గుర్తుచేశారు.
ఇవాళ పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని, స్వాతంత్య్రం తర్వాత భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తోందంటే రాజ్యాంగమే అందుకు కారణమన్నారు. న్యాయం అనేది ప్రతీ పౌరుడి వద్దకు చేరాలనేది మన ప్రాథమిక కర్తవ్యమన్నారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ ఏదయినా సరే ప్రతి ఒక్కరూ పౌరుడి వద్దకు వెళ్లాల్సిందే అని సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు.