13-11-2025 05:11:40 PM
* ఏటూరు నాగారం డివిజనల్ మేనేజర్ కుంజా వానితో "విజయక్రాంతి"
* గిరిజనులకు చేరువలో నిత్యావసర సరుకులు
* డిపోలను ఆధునికరిస్తాం
* గ్యాస్, పెట్రోల్ బంకుల విస్తరణకు ప్రణాళికలు
కాటారం (మహదేవపూర్) (విజయక్రాంతి): గిరిజన సహకార సంస్థ (జిసిసి)కి పూర్వవైభవం తీసుకువస్తామని జిసిసి ఏటూరు నాగారం డివిజనల్ మేనేజర్ కుంజా వాని అన్నారు. గురువారం ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గిరిజన ప్రాథమిక సహకార సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెతో "విజయక్రాంతి" ముఖాముఖి నిర్వహించింది. మారుమూల అటవీ ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందని అన్నారు. గిరిజనులకు అవసరమగు నిత్యవసర సరుకులను ఆయా గ్రామాల్లో గల జిసిసి డిఆర్ డిపోల ద్వారా అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను మరిన్నింటిని సమకూర్చుతామని వెల్లడించారు.
డిపోల ద్వారా అమ్మకాలను పెంచి సంస్థ లాభాల బాటలో పయనించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులైన చీపుర్లు, చిలిగింజలు, ఇప్పపువ్వు లాంటి వాటిని నేరుగా జిసిసి ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారంగా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. మధ్య దళారుల చెంతకు చేరకుండా డిఆర్ డిపోల ద్వారా గిరిజనులు సేకరించిన ఆటవి ఉత్పత్తులను కొనుగోలు చేసి, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపి, అధిక ఆదాయ మార్గాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
జిసిసి డివిజన్ పరిధిలోని ఏటూరునాగారం, ములుగు, నర్సంపేట, మహాదేవపూర్ జిపిసిఎస్ సొసైటీల ద్వారా కార్యకలాపాలను విస్తృత పరుస్తున్నామని వెల్లడించారు. అలాగే జిసిసి ద్వారా నిర్వహిస్తున్న హెచ్ పీ ఎల్పిజి గ్యాస్ అమ్మకాలను పెంచడానికి కృషి చేస్తున్నామని అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ బంకులను జిసిసి ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు మరిన్ని పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడానికి రూపకల్పనలు చేస్తున్నట్లు వెల్లడించారు.