05-02-2026 01:09:59 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ‘తెలంగాణ గద్దర్ సినీ పురస్కా రాలు వేడుక ఈసారి అచ్చ తెలుగు సంప్రదాయ వాతావరణంలో జరగనుంది. మార్చి 19న ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాలకు ఎంపికైన సినిమాల స్క్రీనింగ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈ విషయాలను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయన బుధవారం సచివాలయంలో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. “తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుంది. దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ముంబయి, కోల్కతా, చెన్నై వంటి నగరాల్లో సినీ పరిశ్రమ పెరగడానికి అంతగా అవకాశాలు లేవు. దేశంలో ఉన్న అన్ని భాషల పరిశ్రమ హైదరాబాద్లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకం ఉన్నాయి’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.
అవార్డుల్లో సందేశాత్మక సినిమాలకు ప్రాధాన్యం
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఇంకా మాట్లాడుతూ.. “సమాజం కో సం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్. తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్.
అందుకే వారి పేరు మీద గత సంవత్సరం నుంచి సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభించాం. సినీ రంగ ప్రముఖులకు ఉన్న అనుభవాన్ని, నిబద్ధతను, సినిమా రంగం పట్ల ఉన్న అభిమానం ఉన్న అందరితో సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులుగా ఎఫ్డీ సీ ద్వారా ఎంపిక చేశారు.