14-06-2025 12:50:03 AM
మెదక్, జూన్ 13(విజయక్రాంతి): ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అన్ని సౌకర్యాలతో నాణ్యమైన గుణాత్మక విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ హవేలీ ఘన్పూర్ మండలం కూచనపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తహసిల్దార్ సింధు రేణుకతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, ప్రాథమిక పాఠశాల సౌకర్యాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల నమోదు శాతం పెరగాలని, ఈ గ్రామాల్లో ఉన్న పిల్లలకు ఈ పాఠశాలలోనే అడ్మిషన్ పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం నమోదులో తల్లిదండ్రుల సహకారం మరువలేనన్నారు.
ఉపాధ్యాయుల బోధన పటిమ విద్యార్థులను ఆకర్షింప చేసే విధంగా ఉండాలన్నారు. చిన్నారులకు చేస్తున్న విద్యాబోధనలో ఉపాధ్యాయులు పట్టు సాధించాలని తెలిపారు. అనంతరం బడిబాట కోసం కృషి చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ కొనియాడారు. సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.