calender_icon.png 9 June, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనర్జీ ప్లాంట్(డంపింగ్ యార్డ్) ఏర్పాటు ప్రయత్నాలను ప్రభుత్వం విరమించాలి

09-06-2025 06:07:39 PM

ప్రజా సంఘాలు..

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ పరిసర గుట్టలలో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎనర్జీ ప్లాంట్(Energy Plant) ఏర్పాటు చేసే ప్రభుత్వ ప్రణాళికలను వెంటనే నిలిపివేయాలని స్థానిక ప్రజలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు. సోమవారం హుజురాబాద్ ఆర్డిఓ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు వెయ్యి టన్నుల చెత్తను లారీల ద్వారా ఈ ప్రాంతానికి తరలించడం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని, దానివల్ల శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, భూగర్భ జలాల కాలుష్యం, వ్యవసాయ నష్టాలు తలెత్తే అవకాశముందని అన్నారు.

ఇప్పటికే బూడిద లారీలు ఇక్కడికి ఈ ప్రాంతం మీదుగా తరలిస్తుండగా, ఇప్పుడు డంపింగ్ యార్డ్, పవర్ ప్లాంట్ ఏర్పాట్లు వల్ల పరిస్థితి మరింత తీవ్రతరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితిలో ప్రణాళికను పునఃసమీక్షించి, తగిన ప్రత్యామ్నాయంగా చెత్త ఉత్పత్తి జరిగే మున్సిపాలిటీలలోనే మినీ ప్లాంట్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ కూడా లభించి రవాణా ఖర్చులు తగ్గుతాయని సూచించారు.ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్, ప్రజా సంఘాల నాయకుడు వేల్పుల ప్రభాకర్. తో పాటు రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.