18-11-2025 11:21:10 PM
ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి
అప్పుడే పంచాయతీలకు రావాల్సిన రూ.4 వేల కోట్లు విడుదల సాధ్యం
పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం అన్యాయం
వైఫల్యాన్ని ఇతరులపై మోపడం సరికాదు
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్ (విజయక్రాంతి): రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉన్నప్పుడే 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 21 నెలలు దాటినా, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకవర్గాలు లేకుండాపోయాయని పేర్కొన్నారు. దీంతో పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ. 4,000 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మీడియాతో రాంచందర్ రావు మాట్లాడారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా, కేవలం పార్టీ పరంగానే ఇస్తామన్న ధోరణి అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లు పొందడానికే ఉపయోగించుకుంది తప్ప- రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరమైన చర్యలు మాత్రం తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఇతర పార్టీలపై మోపడానికి ప్రయత్నించడం సరైనది కాదని, కనీసం ఇప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ తరఫున బీసీలకు పెద్దపీట వేస్తామని ఆయన చెప్పారు.
మావోయిస్టులు తుపాకులు వీడాలి
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ‘కగార్’ ద్వారా దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టు చర్యలను నిర్మూలించే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందన్నారు. మావోయిస్టులు తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులు కొంతమంది దుష్టశక్తుల మాటలు నమ్మి సరెండర్ కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. తక్షణమే తుపాకీ వీడి, ప్రజల జీవితంలో కలవాలని ఆయన కోరారు.