05-10-2025 09:52:37 PM
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
బీఎన్ రెడ్డి నగర్ లో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ..
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీకి చెందిన యువకుడు పోలే చంద్రశేఖర్ అమెరికాలోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల ఘటనలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రాత్రి బీఎన్ రెడ్డి నగర్ లో ఉంటున్న మృతుడి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చానని, మీకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటూ న్యాయం చేస్తామన్నారు. చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని, హైదరాబాద్ కు తేవడానికి ఇప్పటికే చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి” అని భరోసా ఇచ్చారు.
రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అమెరికాలో ఉండి, అక్కడి విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. త్వరగా చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేలా కృషి చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని, త్వరగా చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తెప్పించాలని కోరారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకుడు శశిధర్ రెడ్డి, గణేశ్ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ శివ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.