02-12-2025 05:12:10 PM
రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్..
కాటారం (విజయక్రాంతి): కాటారం మండలంలోని కొత్తపల్లి, చింతకాని, రేగులగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆయన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశంపై ప్రత్యేకంగా ఆరా తీశారు. తూకం విధానం, తేమ కొలిచే పరికరాల పనితీరు, ధాన్యం నిల్వ సదుపాయాలు, గన్నీ సంచుల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు.
అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలన్నారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, తహసీల్దార్ నాగరాజు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.