7 July, 2026 | 5:03 AM

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాల్సిందే

11-06-2024 01:53 AM

విధివిధానాలు రూపొందించాలి

పూర్తి డాటా సేకరించి, ప్రణాళికలు సిద్ధం చేయాలి

అధికారుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి):  రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కమాండ్ కంట్రోల్  సెంటర్‌లో పంట రుణమాఫీ, ఇతర అంశా లపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదే శించారు.

రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితా సిద్ధం చేయాలన్నారు. పూర్తిస్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.

రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయిలో వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయం రూపొందించాలని పేర్కొన్నారు. రుణమాఫీకి సంబంధించిన విధివిధానా లను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశిం చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం పంట రుణమాఫీ చేసి తీరాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.