04-02-2026 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్లో బుధవారం జరిగే బీజేపీ సమ్మేళనానికి పరిసర ప్రాంతాల ప్రజలు, అలాగే బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచం దర్రావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా పార్టీ కార్యకర్తలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రసంగాన్ని వీక్షిస్తూ ఈ సమ్మేళనంలో వర్చువల్గా భాగస్వాములవుతారని తెలిపారు.
వికసిత్ తెలంగాణ --వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే బీజేపీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక భాగస్వాములవ్వాలని కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనం బూత్ స్థాయి కార్యకర్తలు, మున్సిపల్ నాయకులు, పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహం, ప్రేరణనిచ్చే వేదికగా నిలవనుందన్నారు. నితిన్ నబిన్ పర్యటన బిజెపి తెలంగాణకు అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.