20-12-2025 01:25:22 AM
వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి సతీష్
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీలో ఈనెల 15వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ధరావత్ హరినాథ్ హత్య కేసును పోలీసులు చేదించారు. శుక్రవారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి సతీష్ వివరాలను వెల్లడించారు.
వెంగళరావు కాలనీ కి చెందిన ధరావత్ హరినాథ్ హత్య అనుమానాస్పదంగా ఉందని మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగించామన్నారు. మృతనీ భార్య శృతిలయ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం ఏరియాలో అటవీశాఖలో బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తోంది. గతంలో ఆమె చర్ల ఏరియాలో పనిచేస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కౌశిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయమై పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించినప్పటికీ, భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని, తన కొడుకు మృతికి కోడలు శృతిలయ కారణమని ఫిర్యాదులో పేర్కొనడంతో శృతిలయను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందన్నారు. ఆమె చెప్పే సమాధానాలు పొంతన లేకపోవడంతో అనుమానించి విచారణ చేపట్టామన్నారు. విచారణలో హత్య చేసి ఆత్మహత్యగా నాటకం చేసిన కేసుగా గుర్తించామన్నారు.
మృతుడి భార్య శృతిలయ, ఆమె ప్రియుడు కొండా కౌశిక్, అతని స్నేహితులు మోహన్ భానులతో కలిసి మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను గొంతు నలిమి హతమార్చి, ఎవరికి అనుమానం రాకుండా ఇంటి వెనక భాగంలో స్లాప్ హుక్కుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు సృష్టించినట్లు అంగీకరించినట్లు తెలిపారు.
దీంతో నిందితులైన ధరావత్ శృతిలయ (ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ పెనుగోలు సెక్షన్, బీట్ ఆఫీసర్), చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొండ కౌశిక్, ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్చెర్లపల్లి కి చెందిన చెన్నమోహన్,(ప్రస్తుతం చర్లలో నివాసం ఉంటున్నాడు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటపాక, రాయన్నపేట కు చెందిన డేగల బానులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.