25-06-2025 12:28:34 AM
సీసీఎల్ ఏ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్, జూన్ 24 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ధరణి వల్ల తీవ్రంగా నష్టపోయిన నారాయణపురం రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, రికార్డులను సరిచేసి అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేసి, రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలను వర్తింపజేయాలని రాష్ట్ర సచివాలయంలో సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నారాయణపురం రైతులకు గతంలో ఉన్న పట్టా పాస్ పుస్తకాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ధరణిలో సాగు చేసుకుంటున్న భూములను అడవిగా నమోదు చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ రికార్డుల నుండి అడవి తొలగించారని అయితే చాలామంది రైతులకు కొత్తగా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని కొందరికి సరిపెట్టారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
అలాగే మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతానగరం, పంతుల్య తండాలో కూడా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడం లేదని, భూభారతి చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సిసిఎల్ఏ కమిషనర్ కు వివరించగా, ఆయా అంశాలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని, రైతుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.