02-12-2025 12:39:12 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, డిసెంబరు 1 (విజయక్రాంతి): నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు. సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలో పోచంపల్లి మండలం జూలూరు క్లస్టర్, పిలాయిపల్లి క్లస్టర్ లో నామినేషన్ ఎన్నికల ప్రక్రియ తీరును పరిశీలించారు.
నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్ని నామినేషన్ లు వచ్చాయని అడిగారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థి నామినేషన్ ఫారం ను పరిశీలించారు.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు.
నామినేషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైందని, మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, అందుకని అభ్యర్థులు ముందు జాగ్రత్త వహించాలన్నారు.
ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు నూతన బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఇబ్బందులు కాకుండా వెంటనే కొత్త ఖాతా తెరవాలని ముందుస్తుగా లీడ్ బ్యాంకు వారికి సూచించామన్నారు.