09-04-2025 02:05:00 AM
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : సన్నబియ్యం పథకం చాలా గొప్పదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ఓ దళిత కుటుంబం ఇంట్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల విరేశం, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ఆయన సన్నబియ్యం భోజనం చేశారు.
ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యం తినలేక లబ్ధిదారులు దళారులకు అమ్మి సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. దళారులకు మేలు చేసే ఈ విధానానికి స్వస్తి పలికి ప్రజాప్రభుత్వం పేదలు కడుపునిండా తినేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా పని చేస్తుందని పేర్కొన్నారు.
సన్నబియ్యం పథకాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్న పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులను మండలి ఛైర్మన్ అభినందించారు. ఆయన వెంట మదర్ డెయిరీ మాజీ ఛైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.