అభాగ్యులకు మర్రిగూడ తాసిల్దార్ దాతృత్వం
మర్రిగూడ, జనవరి 26 : ప్రభుత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అభాగ్యులకు మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్థిక సాయం అందజేశారు. మండలంలో ఉన్న పలు అభాగ్యుల కుటుంబాల సమస్యలు తెలుసుకొని తన స్నేహితుల సహకారంతో సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
మండల వ్యాప్తంగా 20 కుటుంబాలకు అత్యవసర పరిస్థితి తెలుసుకొని రూ,3,00,000 ల మేరకు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం నగదు రూపేనా లబ్ధిదారులకు అందజేశారు.
గత సంవత్సరం మే 19న మర్రిగూడ తాసిల్దారుగా బాధ్యతలను చేపట్టిన నాటినుండి ఇప్పటివరకు ఆసుపత్రిలో,రోడ్డు ప్రమాదం లో, ఇంటి యజమానిని కోల్పోయిన, హఠాత్తుగా మరణించిన కుటుంబాలకు తన వంతుగా 10 నుండి 20వేలవంతున బాధిత కుటుంబాలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఇబ్బందులకు గురవుతున్న కుటుంబాలను తనకు గుర్తు చేసినందుకు పత్రిక విలేకరులను ఆయన అభినందించారు.






