14-05-2025 12:00:00 AM
పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చెందిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, మే 13 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం నేరడిగొండ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది విధులపై, పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్న కేసుల వివరాలను, కేసుల పరిశోధనపై చేసిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రతి పోలీసు కు కేటాయించిన గ్రామాన్ని సందర్శిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని ఆసాంఘిక కార్యకలాపాలు గంజాయి, గుడుంబా, మట్కా, నిర్వహించకుండా చూడాలన్నారు. ఎలాంటి సమాచారన్నైనా నేరుగా సంబంధిత పోలీసు అధికారులకు అందించాలని తెలిపారు. సమాజంలో పోలీసు వ్యవస్థకు ఉన్నత స్థానాన్ని కల్పించే విధంగా విధులను నిర్వర్తిస్తూ జిల్లా పోలీసు కీర్తిని పెంపొందించాలన్నారు.
పోలీస్ స్టేషన్లో ఉండే ప్రతి ఒక్క సిబ్బందికి సమానమైన విధులను కేటాయించేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదు వచ్చిన వెంటనే గ్రామానికి కేటాయించిన పోలీసు అధికారిని విచారణ నిమిత్తం కేటాయించి బాధితులకు సరైన సమయంలో న్యాయం చేకూర్చే విధంగా చూడాలన్నారు.
బ్లూ కోర్ట్, డైల్ 100 విధులను ప్రతివారం పర్యవేక్షిస్తూ మండల పరిధిలో ఎలాంటి మైనర్ డ్రైవింగ్, డంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఫింగర్ ప్రింట్ పరికరాన్ని ఉపయోగించి అనుమానితుల్ని, నేరస్థులను వేలిముద్రలను సేకరించి పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్, నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.