calender_icon.png 30 June, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక, కర్షక జిల్లా సదస్సును జయప్రదం చేయాలి

30-06-2025 12:17:54 AM

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట, జూన్ 29 (విజయక్రాంతి) :దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై 3న  జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్మిక, వ్యవసాయ కార్మిక జిల్లా సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేయాలని భావిస్తున్నదన్నారు. అందులో భాగంగానే కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని వేగవంతం చేస్తున్నదని ఆరోపించారు. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణకు అప్పగించే కుట్ర చేస్తుందన్నారు.

అలాగే ఉపాధి హామీ చట్టాన్ని రోజురోజుకు నిర్వీర్యం చేస్తుందనారు. జూలై 3న జిల్లా కేంద్రంలో జరిగే కార్మిక, కర్షక ఐక్యత సదస్సుకు ముఖ్య అతిథిగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం  హాజరవుతారన్నారు. కావున రైతులు కార్మికులు అధిక సంఖ్యలో సదస్సులో పాల్గొనాలి అన్నారు.

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.