calender_icon.png 10 September, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి జిల్లాలో యూరియా కొరత లేదు

09-09-2025 07:16:26 PM

రైతులకు ప్రస్తుత అవసరాల మేరకు ఇవ్వండి

ఇతర జిల్లాల రైతులు సైతం యూరియా కోసం వస్తున్నారు 

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

గోపాల్ పేట: వనపర్తి జిల్లాలో గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా అందుబాటులో ఉందని, రైతులు అపోహలు పడొద్దు అని, పంటకు రెండవసారి వేయాల్సిన యూరియా సైతం ఇప్పుడే కొని పెట్టుకోవాలి అనుకోవడం వల్ల మిగతా రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) అన్నారు. మంగళవారం గోపాల్పేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు శ్రీ సాయి ఫెర్టిలైజర్స్ సీడ్స్ గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం, వాస్తవిక యూరియా నిల్వలను పరిశీలించారు. పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు సకాలంలో యూరియా కొరకు డి.డి.లు కట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.  అనంతరం అక్కడే రైతులతో మాట్లాడారు. అందుబాటులో ఉన్న యూరియా రైతులకు సక్రమంగా పంపిణీ చేయాలని వ్యవసాయ, సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. వనపర్తి జిల్లాలో గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా వినియోగిస్తున్నారని అన్నారు. మళ్ళీ యూరియా దొరుకుతుందో లేదో అనే భయాందోళనలు పడొద్దని రైతులకు సూచించారు. 

కొంతమంది రైతులు ప్రస్తుత అవసరానికి మించి కొనడం వల్ల ఇతర రైతులకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. రెండో దఫా వేయాల్సిన యూరియా సైతం ఇప్పుడే కొని పెట్టుకోవడం సరి కాదన్నారు. యూరియా పంపిణీ నిరంతర ప్రక్రియ కాబట్టి రైతులు అనవసరంగా ఆందోళన పడి ఉదయాన్నే లైన్లో వేచి ఉండాల్సిన పని లేదన్నారు. జిల్లాలో గత సంవత్సరం ఇంతకన్నా తక్కువ యూరియా ఉండిందని కానీ ఎక్కడ సమస్య తలెత్తలేదన్నారు. ఇప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకెళ్లాలని తర్వాత మళ్ళీ తీసుకోవచ్చని రైతులకు భరోసా కల్పించారు. ప్రస్తుతం గోపాల్పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో 54 మెట్రిక్ టన్నుల యూరియా ఉందన్నారు. రైతులు ఎక్కువమంది రావడంతో నాలుగు స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, గోపాల్పేట తహసీల్దార్ పాండు, ఎంపీడీవో భావన, ఎంఈఓ కరుణశ్రీ  రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు.