24-10-2025 01:16:08 AM
కరీంనగర్, అక్టోబర్౨3(విజయక్రాంతి): డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాం గులు & వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియపరిచే రంగోళీ పోటీలు నిర్వహించారు. కరీంనగర్ క్లబ్ వద్ద రోడ్డుపై ఏర్పాటుచేసిన ఈ రంగోళీ పోటీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల యువత, విద్యార్థులు జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారని అన్నారు.
డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో జిల్లాలో రంగోలి, వాల్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. మత్తు పదార్థాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై 27 మంది మహిళలు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు సబిత, నర్సింగరాణి, సుగుణ, శ్రీలత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ తిరుపతి, కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, మర్రి రాజేందర్పాల్గొన్నారు.