13-06-2025 01:18:48 AM
హైదరాబాద్/ఆదిలాబాద్/రంగారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం జోరువాన కురిసింది. ఆదిలాబాద్ జిల్లాల్లో పిడుగులుపడి ఆరుగురు మృతిచెందారు. మృతులందరూ వ్యవసాయ కూలీలే కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు చోట్ల నీరు రోడ్డుమీదకు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల రోడ్లపై చెట్లు కూలి పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం
ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ, బేల మండలాల్లో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాదిగూడ మండలంలోని పిప్రి గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా వర్షం రావడంతో కూలీలందరూ వ్యవసాయ క్షేత్రంలోని ఓ గుడిసెలోకి వెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడిన పిడుగులు పడటంతో సిడాం రాంబాయి, పెందూర్ మాధవరావు, పెందూర్ సంజన, మంగు భీంబాయి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ ఆరుగురిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బేల మండలంలో పిడుగులు పడిన ఘటనలో ఇద్దరు మహిళ కూలీలు మృతి చెందారు.
సాంగ్డి గ్రామంలో పంట చేనులో విత్తనాలు నాటుతున్న గెడం నందిని (45), సోన్ కాస్ గ్రామంలో విత్తనాలు వేస్తున్న కోవ సునీత (38) పిడుగు పడి మృతి చెందారు. ఒకే రోజు పిడుగులు పడి ఆరుగురు మృతి చెందడం, మరికొంత మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరడం జిల్లా ప్రజలను కలిసివేసింది. అటు పిడుగులు పడిన సంగతి తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు, పోలీసులకు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
జోరువానతో ఇబ్బందులు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో ఎల్బీనగర్, ఉప్పల్, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, అమీర్పేట, కూకట్పల్లి, పంజాగుట్ట, బేగంపేట, బంజారహిల్స్, ఖైరతాబాద్, బోరబండ, మధురానగర్, సికింద్రాబాద్, బోయినిపల్లి, తిరుమలగిరి, హిమాయత్నర్, చాదర్ ఘాట్, కోఠి, అల్వాల్తోపాటు పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.
కొల్లాపూర్ డివిజన్లో 16.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాలతోపాటు ఆమనగల్ బ్లాక్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ఘాట్ ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో భారీ వర్షం కురిసింది.
రెండున్నర గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి నేతాజీ రోడ్డులో ఉన్న నల్లకుంట చెరువు నిండింది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రోడ్డుపైకి వచ్చి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలో కురిసిన జోరువానకు కొన్ని ప్రాంతాల్లో బడులు తెరుచుకోలేదు. వేసివి సెలవుల అనంతరం మొదటిరోజు బడికి వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లాలోఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నట్టు అంచనా వేసింది.
జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్టు అంచనావేసింది. శుక్రవారం నిజామాబాద్, మహబూబాబాద్, వనపర్తి, నాగర్కర్నూల్, నిర్మల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్లా, ములుగు, వరంగల్, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, మెదక్, జనగాం, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.