15-11-2025 11:05:11 AM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న12 ఇసుక ట్రాక్టర్లను శనివారం ఉదయం రెవిన్యూ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలం నుండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పాటు పలు గృహ నిర్మాణాలకు ఈ ప్రాంతంలోని మానేరు వాగుల నుండి ఇసుక ఉచితంగా ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసేందుకు అనుమతి ఉంది. ఉదయం ఎనిమిది గంటల తర్వాత మానేరు వాగులోకి ఇసుక ట్రాక్టర్లు వెళ్లి రవాణా చేయవలసి ఉంటుంది.
సాయంత్రం ఐదు లోపు ఇసుక రవాణా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్లు మానేరు వాగులకు పోయి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను కొంతమంది కొన్నిచోట్ల డంపులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాత అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేయటం జరుగుతుంది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకుగాను పై అధికారుల ఆదేశానుసారం అక్రమంగా తరలి వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరుగుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. పట్టుకున్న ట్రాక్టర్లను తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటి నుండి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్ఐ వినోద్ పేర్కొన్నారు.