పుష్ప-2 ప్రీరిలీజ్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: యూసుఫ్గూడ పోలీస్ లైన్స్లో 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి కోట్ల విజయభాస్కర్ స్టేడియం వైపు వెళ్లే ట్రాఫిక్ను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ-పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
మైత్రీవనం జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, మాదాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ను యూసుఫ్గూడ బస్తీ వద్ద ఆర్బిఐ క్వార్టర్స్-కృష్ణానగర్ జంక్షన్-జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు మళ్లిస్తారు. మైత్రీవనం జంక్షన్ నుండి బోరబండ బస్టాప్ వైపు ట్రాఫిక్ సవేర ఫంక్షన్ హాల్- కృష్ణకాంత్ పార్క్- జీటీఎస్ ఆలయం- కళ్యాణ్నగర్- మోతీనగర్- బోరబండ బస్టాప్ వద్ద మళ్లించబడుతుంది. అదేవిధంగా, బోరబండ బస్టాప్ నుండి మైత్రీవనం జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్ ప్రైమ్ గార్డెన్ కళ్యాణ్నగర్-జిటిఎస్ కాలనీ- కళ్యాణ్నగర్ జంక్షన్- ఉమేష్ చంద్ర విగ్రహం యు-టర్న్ - ఐసిఐసిఐ బ్యాంక్ యు-టర్న్ - మైత్రీవనం జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. ఇదిలా ఉండగా, జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్, మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద సాధారణ ప్రజల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయబడిందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.




