calender_icon.png 21 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ నిర్ణయంతో తెలంగాణపై తీవ్రప్రభావం

21-09-2025 12:56:21 AM

-రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాస్తాం

-హె-చ్1 వీసా ఫీజును పెంచితే మోదీ స్పందించకపోవడం వెనుక మర్మమేంటి!

-భారతీయులకు నష్టం జరుగుతున్నా మౌనమా?

-అమెరికాతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో విఫలం: మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): భారతదేశానికొచ్చే మొత్తం రెమిటెన్స్‌లో 8.1 శాతం వాటాతో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, హెచ్1 వీసా ఫీజు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ర్ట ప్రభుత్వం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ప్రత్యేకంగా లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రాల హక్కులను హరించడంలో బిజీగా ఉన్న కేంద్రానికి మన భారతీయుల గురించి ఆలోచించే తీరిక లేదని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల సమూహమని, కానీ తమ పార్టీ అధికారంలో ఉన్న వాటిని మాత్రమే బీజేపీ రాష్ట్రాలుగా పరిగణిస్తోందన్నారు. ఏ విషయంలోనూ తెలంగాణను రాష్ర్టంగా చూడటం లేదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం సచివాలయలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసనని ఎద్దేవా చేశారు.

హె-చ్1 వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచితే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని, దీని వెనుకున్న మర్మమేమిటని ప్రశ్నించారు. హెచ్1 వీసా పొందేవారిలో సుమారు 72 నుంచి 73 శాతం మంది భారతీయులేనని, ఈ ప్రభావం మనదేశంపైనే అధికంగా ఉంటుందని వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు రికార్డు స్థాయిలో 135.46 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ వచ్చాయని, ఇందులో అమెరికా వాటా 27.7 శాతమని తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో మనకొచ్చే రెమిటెన్స్ తగ్గిపోతాయని, ఆ ప్రభావం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై పడుతుందన్నారు.

ఈ విషయం తెలిసినా ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపలేదని, కనీసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న హె-చ్1 వీసాదారులకు మినహాయింపులను సాధించడంలోనూ విఫలమయ్యిందని విమర్శించారు. భారత్‌కు నష్టం చేకూర్చేలా ట్రంప్ ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించారని, ఇప్పుడేమో హెచ్1 వీసా ఫీజును పెంచారని మండిపడ్డారు. మన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతున్నా ప్రధాని మోదీ మాత్రం స్పందించక పోగా ఇది మన మంచికే అంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు.

ఇప్పటికైనా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి మేల్కొని సమస్య పరిష్కారానికి నేరుగా అమెరికాతో చర్చించాలని డిమాండ్ చేశారు. కనీసం ఇప్పటికే అక్కడున్న హెచ్1 వీసాదారులకు తాత్కాలిక మినహాయింపు కల్పించడంపైనైనా దృష్టి సారించాలని సూచించారు. భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, రెమిటెన్స్‌పై ఆధారపడే కుటుంబాలు, సంస్థల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.