calender_icon.png 5 December, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్‌ జోన్‌లోకి తుర్కయంజాల్‌

05-12-2025 12:28:24 PM

చార్మినార్‌ నుంచి ఎల్బీనగర్‌కు మార్పు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు

తుర్కయంజాల్‌: తుర్కయంజాల్‌ మున్సిపాలిటీని(Turkayamjal Municipality) ఎల్బీనగర్‌ జోన్‌లోకి మార్చుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. హయత్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ వంశీకృష్ణకు చార్జ్‌ తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అనంతరం బుధవారం రోజున చార్మినార్‌ జోన్‌లో తుర్కయంజాల్‌, ఆదిభట్లను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధి సంతోష్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ మంగతాయారుకి తుర్కయంజాల్‌, ఆదిభట్లకు సంబంధించిన ఫైళ్లను అందజేశారు. అయితే, చార్మినార్‌ జోన్‌లో తుర్కయంజాల్‌, ఆదిభట్ల పురపాలికలో చేర్చడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి కాంగ్రెస్‌ నేతలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన రంగారెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో, మంత్రి శ్రీధర్‌ బాబుతో మాట్లాడారు. దీంతో తుర్కయంజాల్‌, ఆదిభట్ల మున్సిపాలిటీలను ఎల్బీనగర్‌ జోన్‌లోకి మార్చుతూ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. 

తుర్కయంజాల్‌లో కాంగ్రెస్‌ నేతల సంబరాలు

తుర్కయంజాల్‌ను ఎల్బీనగర్‌ జోన్‌లోకి మార్చడంపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తుర్కయంజాల్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేతరి దర్శన్‌, పీసీసీ సభ్యులు కాకుమాను సునీల్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రంగారెడ్డి చొరవతో తుర్కయంజాల్‌ను ఎల్బీనగర్‌ జోన్‌లోకి మార్చారన్నారు. పాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గుండ్లపల్లి ధన్‌రాజ్‌, కొశికె ఐలయ్య, మర్రి మహేందర్‌ రెడ్డి, కొంతం వెంకటరెడ్డి (జానీ), బొక్క రవీందర్‌ రెడ్డి, జీవీ స్వామిగౌడ్‌, భాస్కర్‌ రావు, కొల్లూరు నిరంజన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.