15-11-2025 12:10:01 AM
భయాందోళనలో అటవీ గ్రామాల ప్రజలు
బెల్లంపల్లి, నవంబర్ 14 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బుగ్గ గూడెం అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న పత్తి చేనులో గురువారం సాయంత్రం పెద్దపులి దాడి చేసి పల్లె ఎల్లక్క కు చెందిన ఆవును హతమార్చింది. అదే రోజు కాసిపేట మండలంలోని దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలో గల ఎగండి గ్రామ శివారులో పెద్దపులి మరో ఆవు పై దాడి చేసి హతమార్చింది. శుక్రవారం ఉదయం బుగ్గ గూడెం, కరిశెలఘట్టం గ్రామ సమీపాల్లో గల పత్తి చేనులో పెద్దపులి దాడి లో మృతి చెందిన ఆవు కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు.
గత కొద్ది రోజులుగా బుగ్గ గూడెం, వరి పేట, కరిశలఘట్టం, దేవాపూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెబుతు న్నారు. రైతులు, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్ళవద్దని సూచిస్తున్నారు. పెద్దపులి సంచారంతో కాసిపేట మండలంలోని ప్రభావిత గ్రామాలతో పాటు బెల్లంపల్లి మండలం లోని బుగ్గ, కన్నాల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.