12-09-2025 06:54:58 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మర్రికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ మర్రికుంట చెరువు బండ్ ను సందర్శించి అక్కడ నుంచి నీటి ప్రవాహ మార్గాలను, పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, అధికారులతో మాట్లాడి కాల్వ ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మర్రికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
డిజిటల్ లైబ్రరీ సేవలను వినియోగించుకోవాలి
జిల్లాలోని నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ గ్రంథాలయానికి వచ్చిన పాఠకులకు పలు సూచనలు చేశారు. డిజిటల్ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సేవల గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
డిజిటల్ గ్రంథాలయం ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు కావాల్సిన అన్ని రకాల సమాచారం, దినపత్రికలు, ఆన్లైన్ క్లాసులు అందుబాటులో ఉన్నాయని వీటిని ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయం భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. భవన నిర్మాణ విషయంలో అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.