calender_icon.png 19 May, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావు : వేముల ప్రశాంత్ రెడ్డి

19-05-2025 04:37:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావు  అని, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయింది అనుకుంటా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచం గర్వించదగ్గ నిర్మాణాలు చేపట్టడం కేసీఆర్ కే సాధ్యమని, మా నాయకుడి ఆనవాళ్లను చెరిపేస్తా అని చెప్పిన వాళ్లే, ఇప్పుడు ప్రపంచానికి చూయించుకునే పరిస్థితి ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం, నాగార్జునసాగర్ బుద్ధవనం చూసి ప్రపంచ సుందరీమణులు సంబరంతో ఆశ్చర్య పోయి సెల్ఫీలు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.

అట్లాగే అమరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణం, టీ హబ్ లను కూడా ప్రపంచ సుందరిమణులకు చూయించండని చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం ఎవరితరం కాదు.. కేసిఆర్ అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని గుర్తు చేసుకున్నారు. దిగజారుడు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు మాని.. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు, పరిపాలనపై దృష్టి సారించు రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. అవి గొప్ప నిర్మణాలని, చేరిపేస్తే చేరిగిపోవడానికి  మట్టి రాతలు కాదని, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం శాశ్వతంగా నిలిచిపోయే కేసీఆర్ ఆనవాళ్లు అని ఎమ్మెల్యే వేముల తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన పోటీదారులతో తెలంగాణ గొప్ప తనం ప్రపంచానికి తెలిసేలా చేయడానికి కేసిఆర్ కట్టించిన ఆ నిర్మాణాలు, రాచరిక పోకడలు అని మాట్లాడి తెలంగాణ చిహ్నం నుండి తొలగించాలి అనుకున్న చార్మినార్, కాకతీయ కళా వైభవాలే  ఈ ప్రభుత్వానికి దిక్కు అయ్యాయని మండిపడ్డారు.

అట్లాగే.. తెలంగాణ అమరుల త్యాగం తెలంగాణ ప్రజల గుండెల్లో నిరంతరం జ్వలించేలా కేసీఆర్ కట్టించిన  అమరుల స్మారక జ్యోతి చిహ్నం, బడుగు బలహీన వర్గాల కోసం పని చేయాలని పాలకుల్లో స్ఫూర్తిని నింపే విధంగా కట్టిన 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణంలను కూడా మిస్ వరల్డ్ పోటీదారులకు చూయిస్తే  తెలంగాణ చరిత్ర, అమరుల త్యాగం, రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ గొప్పతనం విశ్వవ్యాప్తం అవుతుందని సూచించారు. తెలంగాణ అంటే కేసీఆర్...కేసీఆర్ అంటే తెలంగాణ వాటిని చేరిపేయాలనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిస్తే... రేవంత్ రెడ్డి ఆవగాహన లేని పరిపాలనతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో రోజురోజుకు దిగజారుతున్నదని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ధాన్యం కొనేవారు లేక, అకాల వర్షాలకు తడిచిన ధాన్యం అమ్ముకోలేక బాధతో  కల్లాల మీద రైతులు ప్రాణాలు వదులుతుంటే, జీతాలు సరిగ్గా రాక చిన్న ఉద్యోగులు తమ నిత్య నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల (గుల్జార్ హౌజ్ లో అగ్ని ప్రమాదం)అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, రాష్ట్రంలో విచ్చల విడిగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అంత బాగున్నట్టు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో మునిగి తేలుతున్నాడని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.  రాష్ట్రం దివాళా తీసింది, ఎక్కడ అప్పు పుట్టటం లేదు, కేంద్రంలో నన్ను చెప్పులు ఎత్తుకు పోయేవాడి లాగా చూస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడు. మరి అలాంటప్పుడు అందాల పోటీల పేరుతో వందల కోట్ల దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు..సమయం వచ్చినప్పుడు వడ్డి తో సహా చెల్లిస్తారని,నీ పరిపాలన తో విసుగు చెందుతున్న ప్రజలే రేవంత్ రెడ్డి రాజకీయ ఆనవాళ్లు తెలంగాణ నుండి శాశ్వతంగా చేరిపేస్తారు. అని వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.