ప్రశాంతంగా గ్రామపాలన అధికారుల పరీక్ష..
పరీక్షకు 35 మంది గైర్హాజరు..
జిల్లా కలెక్టర్ త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi), ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్(In-charge Additional Collector Narayan Amit) కలిసి గ్రామ పాలనాధికారుల పరీక్షను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్ ఇన్విజిలేటర్లతో పరీక్ష తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరీక్షకు హాజరైన వారు, గైర్హాజరైన వారి వివరాలను, పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, బందోబస్తు, తదితర అన్ని అంశాలను పరిశీలించారు.
కాగా నల్గొండ జిల్లా నుండి గ్రామ పాలన అధికారుల పరీక్షకు 276 మంది హాజరు కావలసి ఉండగా 241 మంది పరీక్షకు హాజరయ్యారు. 35 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామ పాలనాధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అధనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, తహసిల్దార్ హరిబాబు, తదితరులు ఉన్నారు.




