18-06-2025 02:01:45 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో నూతన మంత్రిగా నియమితులైన వివేక్ వెంకటస్వామి బుధవారం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయన చాంబర్ లో వివేక్ సతీమణితో కలిసి పూజ కార్యక్రమం నిర్వహించి మంత్రిగా మొదటి సంతకం చేశారు. అనంతరం కార్మిక, మైనింగ్ శాఖ అధికారులు వివేక్ వెంకటస్వామికి పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... త్వరలో మైనింగ్ కోసం కొత్త విధానం తీసుకొస్తామని, తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే నైపుణ్యాలు పెరగాలని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలు పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఏటీసీల ద్వారా నైపుణ్యాలు పెంపొందిస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కొత్త కోర్సులు తీసుకొస్తామని మంత్రి వివేక్ తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో నూతన మంత్రిగా నియమితులైన నేపథ్యంలో గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసం మర్యాదపూర్వకంగా కలిశారు.