08-05-2025 12:00:00 AM
‘ఆపరేషన్ సిందూర్’ మనకు పండుగ దినం
మాజీ సైనిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల భిక్షపతి
జనగామ, మే 7 (విజయక్రాంతి): పాకిస్తాన్ తో ఏ క్షణంలో యుద్ధం ఏర్పడినా ఆ యుద్ధంలో పాల్గొనేందుకు మాజీ జవాన్లం సిద్ధంగా ఉంటామని మాజీ సైనిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ కర్నల్ మాచర్ల భిక్షపతి ప్రకటించారు. ఉగ్రమూకలను తుద ముట్టించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మనకు పండుగ దినమని ఆయన అన్నారు. బుధవారం జనగామ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాకిస్తాన్ ఉగ్ర చర్యల వల్ల ప్రస్తుతం యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయని, భారతసైన్యానికి తోడుగా తాము బ్యాగులు సర్దుకొని సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇటీవల పహల్గాంలో టెర్రరిస్టులు పాశవిక దాడి చేసి అమాయకుల సింధూరాలను దూరం చేశారని, అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.
పహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే భారత రక్షణ దళం వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం అభినందనీయమన్నారు. ఉగ్రవాదాన్ని పాతాళానికి తొక్కడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ హాస్పిటల్ ఎండీ జైన రమేశ్, మాజీ సైనిక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కోశాధికారి యూసుఫ్, సభ్యులు కుమార్యాదవ్, వెంకన్న, ప్రభాకర్, డాక్టర్ గౌతంరెడ్డి, బద్రీనాథ్, రాజేశ్ పాల్గొన్నారు.