కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం
- ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రూపురేఖలను మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించడం మన దురదృష్టకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అసెంబ్లీ వద్ద సోమవారం ఆమెను అరెస్టు చేసిన సందర్భంగా మాట్లాడు తూ.. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని విమర్శించారు.
రాజీవ్గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి, తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని, ్ల స్ఫూర్తిని నింపిన తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచం లో మరెక్కడా లేదన్నారు.
తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలంటే గన్పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్రెడ్డికి తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు లేదన్నారు.






