21-10-2025 06:47:35 PM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్..
గద్వాల: ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం గట్టు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితనం, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అవసరమైన మార్గదర్శక సూచనలు ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సహజ ప్రసవాల సంఖ్యను పెంచే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, గర్భిణీ స్త్రీల ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్, చెక్ అప్ వంద శాతం పూర్తిచేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపి,హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి తగిన వైద్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ట్యూబర్క్లోసిస్, మధుమేహం, రక్తపోటు స్క్రీనింగ్ టెస్టులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రోగులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారికి మెరుగైన, సౌకర్యవంతమైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని ఆయన సూచించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలోని స్టీరిలైజేషన్ రూమ్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రిజిస్టర్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందిస్తున్న సేవల రోగులు సంతృప్తికరంగా ఉన్నాయని తమ భావాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్య ప్రకాష్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.