గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తాం
- ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ప్రజాభవన్లో ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు
- శుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు, పార్టీ నేతలు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి భట్టి విక్రమార్క తన జన్మదిన వేడుకులను జరుపుకున్నారు. గురుకులాల విద్యార్థులతో కలిసి భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనాలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
గురుకుల పాఠశాల్లోని సమస్యలను తెలుసుకున్నానని, వాటిని పరిష్కరించడానికే విద్యార్థుల వద్దకు వచ్చినట్టు భట్టి తెలిపారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థుల అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిగా ప్రభుత్వం భావిస్తుందన్నారు. ప్రతి మండలంలో 20 నుంచి 25 ఎకరాల్లో సమీకృత రెసిడెన్షీయల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.
గురుకుల పాఠశాలలను విజిట్ చేసి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా, వైద్యాన్ని ప్రక్షాళన చేయడానికి సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులందరూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయనున్నారని తెలిపారు. పోటీ పరీక్షలకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు, కోచింగ్ కోసం అధ్యాపకులను నియమిస్తామన్నారు. అడంబరాలకు వెళ్లే రాజకీయ నాయకులు, అమాత్యులకు భిన్నంగా సాధాసీదాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు.
ప్రజాభవన్లో జన్మదిన వేడుకలు
భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ప్రజాభవన్లో శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రోటోకాల్ అధికారులతో ప్రత్యేక పుష్పగుచ్ఛాన్ని పంపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాభవన్లో పోచమ్మతల్లి దేవాలయం వద్ద భట్టి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను యాదగిరిగుట్ట వేదపండితులు, హైదరాబాద్లోని ప్రముఖ దేవాలయాల అర్చకులు ఆశీర్వదించారు. ఆయన కుటుంబసభ్యుల సమక్షంలో 50 కిలోల కేక్ను కట్ చేశారు.
భట్టికి సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ నాయకులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భట్టికి శుభా కాంక్షలు తెలిపినవారిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, రోహిత్చౌదరి, సంపత్కుమార్, మంత్రు లు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీలు మహేష్కుమార్గౌడ్, తీన్మార్మల్లన్న, ఎమ్మెల్యేలు దానంనాగేందర్, రాంచందర్నాయక్, బాలునాయక్, వీర్లపల్లి శంకర్, మాలోత్ రాందాసు, సిరిసిల్ల రాజయ్య, ఎంపీ బలరామ్నాయక్, మాజీ ఎంపీ కనుమూరి బాపురాజు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు తదితరులు భట్టిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.






