03-07-2025 01:54:27 AM
సిద్దిపేట, జూలై 2 ( విజయక్రాంతి): దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట (పదో వార్డు)లో నిర్మించిన డంపు యార్డ్, డీఆర్సీసీ కేంద్రాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ తెలిపారు. బుధవారం డంపు యార్డును సిబ్బందితో కలిసి పరిశీలించారు. డంపు యార్డులోని తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ చేసేందుకు, వాటి నుంచి ఎరువుల తయారీకి రెండు రోజుల్లో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను నియమించనున్నట్లు తెలిపారు.
వారం రోజుల్లో డీఆర్సీసీ సెంటర్ లో విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను చేపడతామన్నారు. డంప్ యార్డ్ కేంద్రంలోకి అపరిచితులు, చెత్త ఏరుకునేవారు రాకుండా దాని చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి, చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే ఇవ్వాలని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని కోరారు.
ఏఈలకు సన్మానం...
దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తూ, బదిలీపై వెళ్తున్న శ్రీకాంత్ కు, బదిలీపై వచ్చి ఏఈగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనాథ్ లకు శాలువాలుకప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, సిబ్బంది శ్రీకాంత్, మధుసూదన్, కల్పన, మేఘమాల, సంధ్య తదితరులు పాల్గొన్నారు.