10-06-2025 10:33:22 PM
- ప్రజా పాలనలో నిరుపేదలకే సంక్షేమ పథకాలు..
- నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి..
నాగర్ కర్నూల్ జోన్ (విజయక్రాంతి): గత పదేళ్ల కాలంలో రాజకీయ పలుకుబడి, పరపతి ఉన్న వారికే బీఆర్ఎస్ ప్రభుత్వ అందించిన సంక్షేమ పథకాలు అందాయని కానీ ప్రస్తుతం ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలు అణగారిన వర్గాల వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది నిరుపేదలు విద్యార్థులు యువకులు తమ ప్రాణాలను బలి తీసుకున్న క్రమంలో ఓ తల్లిగా చలించిపోయి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్లు గుర్తు చేశారు. అందుకు కృతజ్ఞతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గారెంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేస్తూనే హామీ ఇవ్వని వరి సన్న రకం బోనస్, సన్న బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వారితోపాటు హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంగప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు ఉన్నారు.